నిందితుల భద్రతపై పోలీసుల్లో కలవరం

నిందితుల భద్రతపై పోలీసుల్లో కలవరం


వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసులో నిందుతుల భద్రతపై పోలీసుల్లో కలవరం మొదలైంది. కేసు విచారణలో వాళ్ళ నుండి సేకరించాల్సిన వివరాలు, తీసుకోవాల్సిన స్టేట్మెంట్ కోసం నలుగురిని తమ కస్టడికి అప్పగించాలని పోలీసులు కోర్టును అడగుతున్నారు. ఇదే విషయమై కోర్టు విచారిస్తోంది. విచారణ ముగిసిన తర్వాత కోర్టు ఏమంటుందనేది వేరే విషయం.



కానీ తాము కోరినట్లుగా నలుగురిని పోలీసు కస్టడీకి అప్పగిస్తే వారి భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నతాదికారుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇపుడు పోలీసుల ఆలోచన ఎలాగుందంటే వారిని కస్టడీలోకి తీసుకోకుండా ఉండలేరు. అలాగని వారికి ఎన్నో రోజులు పూర్తి భద్రతా కల్పించలేరు. మొన్న శంషాబాద్ పోలీసు స్టేషన్లో నిందితులను ఉంచినపుడు జరిగిన గొడవను పోలీసులు ఇంకా మరచిపోలేకున్నారు. స్టేషన్లో నిందితులను ఉంచిన విషయం తెలుసుకున్న జనాలు స్టేషన్ చుట్టూ భారీ సంఖ్యలో చుట్టుముట్టటంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగిపోయాయి.


జనాల దెబ్బకు నిందుతులకు వైద్య పరీక్షలు చేయించటానికి డాక్టర్లనే పోలీసుస్టేషన్ కు పిలిపించాల్సొచ్చింది. డాక్టర్లే కాదు చివరకు మెజిస్ట్రేట్ ను కూడా స్టేషన్ కే పిలిపించి విచారణ జరిపించి 14 రోజుల రిమాండ్ కు తరలించాల్సొచ్చింది. రిమాండ్ కు పంపేటపుడు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, ఆర్ముడు రిజర్వు పోలీసు, పోలీసు బెటాలియన లాంటి దళాలను భారీగా మోహరించి నలుగురిని వేర్వేరు వ్యాన్లనో చర్లపల్లి జైలుకు తరలించాల్సొచ్చింది.


నిందుతులను జైలుకు తరలించేటపుడు పెద్ద ఎత్తున లాఠీచార్జి చేసి జనాలను చెదరగొట్టిన తర్వాత కానీ సేఫ్ గా పోలీసులు వాళ్ళని అక్కడి నుండి తీసుకెళ్ళలేకపోయారు. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే నలుగురిని విచారణ నిమ్మితం మళ్ళీ అదుపులోకి తీసుకున్నా ఎక్కడో ఓ రహస్య ప్రాంతంలో ఉంచి విచారణ జరపాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు సమాచారం. విచారణ వరకు ఓకే కానీ ఏ కారణం వల్లనైనా మళ్ళీ వాళ్ళని క్రైం జరిగిన ప్రాంతానికి తీసుకెళ్ళాల్సొస్తే ఏం చేయాలన్న విషయంలోనే టెన్షన్ పట్టిపీడిస్తోంది.