ఇప్పటివరకు దేశంలో ఇదే అతిపెద్ద అత్యవసర పరిస్థితి

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశం అతిపెద్ద అత్యవసరపరిస్థితిని ఎదుర్కొంటున్నదని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ అన్నారు. దేశమంతటా కరోనా వైరస్‌ విస్తరించడం, రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినతర్వాత ఇదే అతిపెద్ద అత్యవసర పరిస్థితి అని తన బ్లాగ్‌లో వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణ ప్రజలకోసం ప్రభుత్వం ఖర్చుచేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని, అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం లేదా వాటిని వాయిదావేసుకోవాలని సూచించారు. ప్రతి పనిని ప్రధాని కార్యాలయం నుంచి చేయాలనుకుంటే అది మరింత ఆలస్యం కావడంతోపాటు, పని తక్కువగానే అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణ ప్రజలకోసం ఖర్చు చేయడం సరైన పనే అవుతుందని,  భారీ ఆర్థికలోటుతో మనం ఈ సంక్షభంలోకి ప్రవేశించామని, మరింతగా ఖర్చుపెట్టాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అమెరికా, యూరప్‌ దేశాల మాదిరిగా రేటింగ్స్‌ కోసం భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.